ఒక్కొసారి మనల్ని చూచి మనం చాలా దిగులుపడతాము. “ఏంటి ఈ జీవితం,
ఇన్ని కష్టాలు, బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి' అని చాలా బాధపడిపోతామే
కాని అవన్నీ మనకు రావడానికి గల కారణాలు గురించి ఆలోచించము. అందుకు
మూలము ఏంటో మనకు తెలీక తెగ గింజుకుంటాము. మనకి ఏ కష్టం వచ్చినా,
బాధ వచ్చినా అవి మనకు దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు, బాధలు
రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, దేవునికి అవిధేయగా జీవిస్తూ
మనం చేసే పాపాలకు శిక్షగా వస్తాయి. రెండు, మనం దేవుని బిడ్డలుగా
జీవిస్తున్నప్పుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడటానికి వస్తాయి.
ఎటొచ్చీ ఈ కష్టాలు,
బాధలు వచ్చినప్పుడు బెంబేలెత్తి భయపడిపోయేది దేవునికి
అవిధేయతగా ఉండేవారే తప్ప దేవుని బిడ్డలకి అలాంటి పరిస్థితి ఉండదు. మనకి
ఎప్పుడైనా కష్టమోచ్చినా, బాధవచ్చినా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేశామేమో
అని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించని
వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. 'మీరు నా మాట వినక, నా
ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడలను... మీ కన్నులను
క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును, క్షయ
రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు
వ్యర్ధములగును... నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల యెదుట మీరు
చంపబడెదరు' (లేవీయ. 26:14-17). దేవుని మాట వినకపోవడం వలన వచ్చే
ఇలాంటి కష్టాలు, బాధలు ఎంత భయంకరంగా ఉంటాయో 26వ అధ్యాయం
మొత్తం చదివితే తెలుస్తుంది. ఈ భూమి మీద జీవించే తాత్కాలికమైన జీవితాన్ని
ఇలాంటి శ్రమలతో జీవిస్తే ఇంక దేవుడిచ్చిన ఈ విలువైన జీవితానికి అర్ధం
ఏముంటుంది? 'నా మాట విను' అని మన పిల్లలతో మనం ఎందుకు చెప్తాము?
వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే కదా! దేవుడు కూడా 'నా మాట వినండి' అని మన
భవిష్యత్ బాగుండాలనే చెప్తాడు తప్ప మనం కష్టాలు, బాధలు పడాలని కాదు.
దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలులు చేస్తాడన్నది లేవీయకాండము
26:3-13లో చెప్పాడు. అది ఒకసారి క్షుణ్ణంగా చదివి మీరు దేవుని మాట వింటారో
లేదా మీ ఇష్ట ప్రకారం జీవిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.
ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ మాట విని, నీ
ఇష్టప్రకారం జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామమున
అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
No comments:
Post a Comment